భక్తుల కోర్కెలు తీర్చే
సుబ్రహ్మణ్య స్వామి
–నిత్యం స్వామి వారికి పూజాధికాలు
-ప్రతి మంగళవారం వ్రతాలు, అభిషేకాలు
కైలాసనాధుడు కుటుంబమంతటిని మీరు ఒకేసారి దర్శించాలనుకుంటున్నారా..? అలాంటి
అరుదైన దర్శనం మీకు ఎక్కడైనా దొరుకుతుందంటారా..? తూర్పు గోదావరి జిల్లాలోగల సుమారు 2
వందల ఏళ్ళ చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ అవకాశం భక్తులకు లభిస్తుంది.
సర్పదోష నివారణ, సంతాన ప్రాప్తికి ఈ ఆలయం పెట్టింది పేరు. నవాబులకాలంలో స్థాపించబడిన ఈ
ఆలయం తొలుత మసీదు నిర్మాణంలా వుండగా కాలక్రమేణా గుడి రూపం సంతరించుకుంది. ఈ
ఆలయ విశిష్టత తెలిసిన భక్తులు దేశ విదేశాలలో వున్నప్పటికి వారి సంఖ్య అంతంత మాత్రమే. స్థానికంగా
మాత్రం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఈ గుడికి పెద్ద పేరే వుంది. దీని గొప్పతనం గురించి అందరికి
తెలియజెప్పడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ చిరు ప్రయత్నం.
పూజారుల కధనం ప్రకారం స్థల పురాణం :
నైజాం ప్రాంతాన్ని నవాబులు పాలిస్తున్న కాలంలో ఫజుల్లాఖాన్ అనే ముస్లిం మతస్థుడు 2 శతాబ్దాల క్రితం
ఏజెన్సీ ప్రాంతంలో తహసిల్దార్గా పని చేసేవాడు. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతుల నుంచి కౌలు
వసూలు చేసి దానిని నిజాం ప్రభువుకు పంపిచేవాడు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోయినా
రైతుల ముక్కు పిండి మరీ కౌలు వసూలు చేసి రాజుగారికి అందజేయడంతో ఆయనకు నైజాం పాలనలో
మంచి పేరు ప్రఖ్యాతులు లభించేవి. ప్రతి ఏడాది పంట కాలంలో రైతుల వద్ద నుంచి కౌలు వసూలు
చేయడానికి వచ్చే ఫజుల్లాఖాన్ దేవీపట్నం మండలం పెద్ద భీంపల్లి పరిసరాల్లో వున్న కొండల్లో రాత్రి పూట
వేటకు వెళ్ళేవాడు. అయితే ఇక్కడున్న నాలుగైదు కొండల్లో ఒక కొండపై మాత్రం అతని వేటకు ఓ త్రాచు
అడ్డుపడేది. పశుపక్షాదులను వేటాడుదామని గుర్రంపై సంచరించే ఫజుల్లాఖాన్కు ఆ నాగు ఆటంకంగా
మారడంతో దాన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన వద్ద పని చేసే సిబ్బంది ఎంతగా
వారించినా వినకుండా ఓ రోజు ఆ పామును చంపేశాడు. సర్పం మరణించిన తక్షణమే తహసిల్దార్
ఫజుల్లాఖాన్ చూపు కోల్పోయాడు. సిబ్బంది సాయంతో కొండ మీద నుంచి కిందికి వచ్చిన ఆయన తాను
ఎంతటి తప్పిదం చేశాడో గ్రహించాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలచాడు.
రాజమహేంద్రవరం నుండి పండితులను పిలిపించి జరిగిందంతా వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న
ఆ పండితులు కైలాసనాధుడి కంఠ భూషితమైన సర్పం సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపం కావడంతో ఆ
స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించాలని చెప్పారు. దాంతో ఫజుల్లాఖాన్ తాను ఎక్కడైతే
పామును చంపాడో అక్కడే ఆ నాగరాజును సమాధి చేశాడు. ప్రత్కేకంగా శిలను రప్పించి
సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాన్ని చెక్కించి ఆ సమాదిపైనే ప్రతిష్టించాడు. ఇక్కడ నిరంతరాయంగా
పూజాధికాలు నిర్వహించేందుకు పండితుల సూచనల మేరకు మండపేట సమీపంలోని కోరుమిల్లి నుంచి
ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని పిలిపించి ఇక్కడ నిత్య పూజలు ప్రారంభించాడు. కొంతకాలానికి ఫుజుల్లాఖాన్
చూపు తిరిగి రావడంతో జరిగిదంతా నిజాం ప్రభువుకు చెప్పాడు. వారు నమ్మకపోయినా ఆయన శిస్తు
వసూలుకు వచ్చినప్పుడల్లా ఈ కొండ మీదకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజాధికాలు నిర్వహించేవాడు.
కాలక్రమంలో ఆయన వయోభారం చేత ఈ ప్రాంతానికి రాలేకపోతుండడంతో ఈ కొండకు సుమారు
నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వుండే పెద్ద భీంపల్లి గ్రామస్థులతో మాట్లాడి వారిని కొండ సమీపంలోకి
తరలించాడు. ఈ ప్రాంతానికి కూడా ఆదే ఊరు పేరును పెట్టి వారికి కొంత భూమిని అప్పగించి స్వామికి
ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
కోరుమిల్లి నుండి పూజారులు :
అప్పట్లో ఈ ప్రాంతంలో వేద పండితులు లేకపోవడంతో రాజమహేంద్రవరంకు చెందిన కొందరు
ప్రముఖుల సూచనల మేరకు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలోవున్న కొన్ని బ్రాహ్మణ
కుటుంబాలను ఫజుల్లాఖాన్ ఇక్కడికి రప్పించాడు. వారి జీవనాధారం కోసం కొన్ని ఎకరాల పొలం కూడా
అప్పగించాడు. తర్వాత కాలంలో ఆయన మరణించినప్పటికి గ్రామస్థుల సహకారంతో కోరుమిల్లి
బ్రాహ్మణ కుటుంబాల వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకాలు
నిర్వహిస్తుంటారు. అలాగే ప్రతి ఏటా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు
ఘనంగా చేస్తున్నారు. లంక బ్రహ్మయ్య అనే బ్రాహ్మణ పండితుడు ఈ ఆలయంలో తొలి పూజారికాగా
ప్రస్తుతం ఆయన నాలుగో తరం వారు ఇక్కడ పూజాధికాలు జరుపుతూ ఉపాధి పొందుతున్నారు.
బ్రహ్మయ్య తర్వాత లంక సత్యన్నారాయణ మూర్తి, తర్వాత వారి కుమారుడు లంక రాజలింగేశ్వరరావు
వంశ పారం పర్యంగా పూజా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వీరి కుమారుడు లంక నాగ సతీష్
ఆధ్వర్యంలో ఈ ఆలయంలో స్వామికి వారి నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు ఇచ్చే
కానుకులే వారికి జీవనాధారం. చాలీచాలని ఆదాయమే వస్తున్నప్పటికి స్వామి వారి పూజాధికాలు
నిరాటంకంగా సాగిస్తున్నారు. తహసిల్దార్ ఫజుల్లాఖాన్ ఇచ్చిన భూముల్లో చాలా వరకూ ఆన్యాక్రాంతం
అయిపోయినప్పటికి తమ వంశ పారంపర్యంగా సుబ్రహ్మణ్య స్వామి సేవలోనే వీరి కుటుంబం తరిస్తుంది.
కొంత భూమి ఇంకా గుడి ఆధీనంలోనే వున్నప్పటికి ఇక్కడ కరపెండలం దుంపను పండించడంవల్ల
గుడికి పెద్దగా ఆధాయం లభించడంలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని దేవాదాయ ధర్మాదాయ
శాఖ కూడా ఈ ఆలయం గురించి పట్టించుకోలేదు. అందువల్లే ఈ ఆలయానికి పెద్దగా ప్రాచుర్యం
లభించలేదు.
శివ కుటుంబం అంతా ఒక చోటే దర్శనం :
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడకు వచ్చే భక్తులు ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి.
ఎందుకంటే ఇక్కడ స్వామిని దర్శించుకోవడమంటే ఒకేసారి శివ కుటుంబం మొత్తాన్ని దర్శించుకునే
భాగ్యం కలుగుతుంది. దానికి కారణం ఏమిటంటే ఎక్కడైతే ఫజుల్లాఖాన్ సర్పాన్ని చంపి సమాధి చేశాడో
ఆ సమాధి మీద సుబ్రహ్మణ్యస్వామితోపాటు ఆయన భార్యలైన వల్లీ, దేవసేన విగ్రహాలే కాక స్వామి
తల్లిదండ్రులైన శివ పార్వతుల విగ్రహాలను కూడా ఆ తహసిల్దార్ ప్రతిష్టించాడు. దానివల్ల వల్లీదేవ సేన సమేత సుబ్రహ్మణ్య స్వామితోపాటు ఆదిదంపతులైన శివపార్వతులను కూడా ఒకేసారి ఇక్కడ
దర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. ఇలా శివ కుటుంబం అంతా ఒకేచోట కొలువు తీరి వుండడం
చాలా అరుదైన విషయమనే చెప్పాలి. ఈ కారణంగానే ఇక్కడకు స్థానికులతోపాటు పరిసర గ్రామ
ప్రజలేకాక అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళు
తుంటారు.
వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతుంది :
ఈ ఆలయం భక్తుల పాలిట కల్పతరువుగా మారింది. ఇక్కడకి వచ్చే భక్తుల మనసులోని కోరికలు
నెరవేరడంతో ఈ ఆలయానికి కొంత ప్రాచుర్యం లభించింది. ఆ నోటా ఈ నోటా స్వామి వారి మహత్యం
తెలుసుకున్న భక్తులు దూరాభారం కూడా లెక్క చేయకుండా ఫజుల్లాబాద్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని
దర్శించుకుని వెళుతుంటారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్నా వివాహం కాని వారు ఈ ఆలయానికి
వచ్చి నాగదోష నివారణ పూజ చేస్తే వారికున్న దోషం పోయి వెంటనే వివాహం జరగడం విశేషం. అలాగే
పెళ్ళైన దంపతులు సంవత్సరాలు గడిచిపోతున్నా సంతానం కలగకపోతే ఈ ఆలయంలో కొలువైన
స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే ఏడాది తిరిగేలోపు పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. అంతేకాక
ఉద్యోగాలు, పదోన్నతులు, వ్యాపారాభివృద్ది ఇలా ఎవరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని
పూజారులు ఘంటాపధంగా చెబుతారు. దాంతో ఆయా అవసరతలున్న వారు సుబ్రహ్మణ్య స్వామిని
దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. అంతేకాక తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి
మొక్కుబడులు కూడా చెల్లిస్తుంటారు.
ఫజుల్లాబాద్ గ్రామం ఏర్పడింది ఇలా :
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెద్ద భీంపల్లి పంచాయితీ పరిధిలో ఈ గ్రామం ఏర్పడింది.
నిజాం ప్రభువుల ఏలుబడిలో ఈ ప్రాంతంలో పని చేసిన తహసిల్దార్ ఫజుల్లాఖాన్ వల్లే ఇక్కడ
సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏర్పాటు కావడంతో ఆయన పేరునే పెద్ద భీంపల్లి గ్రామ ప్రజలు ఈ
ప్రాంతానికి పెట్టుకున్నారు. ఫజుల్లాఖాన్ తరచూ హైదరాబాద్ వెళ్ళి వస్తుండడంవల్ల ఆయన పేరులోని
ఫజుల్లా అనే అక్షరాలను తీసుకుని హైదరాబాద్లోని బాద్ అనే అక్షరాలను కలిపి ‘ఫజుల్లాబాద్’ అనే
పేరును ఆలయం వున్న ప్రదేశానికి పెట్టారు. ఇది దేవీపట్నం మండలంలో వున్నప్పటికి గోకవరం మండల
కేంద్రం మీదుగా రహదారి మార్గం వుంటుంది. చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరానికి సుమారు 35
కిలోమీటర్ల దూరంలోవున్న ఈ ఆలయానికి భక్తులు చేరుకోవాలంటే గోకవరం వరకూ ఆర్టీసి బస్సు
సదుపాయం వుంటుంది. అక్కడ నుండి ఆటోలు అందుబాటులో వుంటాయి. ఇక జిల్లా కేంద్రమైన
కాకినాడ నగరానికి ఫజుల్లాబాద్ 70 కిలో మీటర్ల దూరంలో వుంది. అక్కడ నుంచి కూడా గోకవరం వరకూ
ఆర్టీసి బస్సు సదుపాయం వుంటుంది. ప్రయాణికులు అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఆటోలో
ప్రయాణిస్తే ఫజుల్లాబాద్ చేరుకుంటారు.
Famous Subramanya Swamy Temple
